ఓ వైపు ఆందోళనలు..బీహార్‌లో దారుణం

ఓ వైపు ఆందోళనలు..బీహార్‌లో దారుణం



బక్సర్ : దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాచార ఘటనలపై అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హత్యాచార నిందితులకు తక్షణమే కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని నిరసనలు వ్యక్తమవుతుండగా..బీహార్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లాలోని కుకుఢా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ఓ బాలికను అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం బాలికకు నిప్పంటించి తగులపెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఇలాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో కాలిపోయిన బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు బక్సర్ డీఎస్పీ సతీశ్‌కుమార్ తెలిపారు. రాజధాని నగరం పాట్నాకు సుమారు 100కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతురాలు మైనర్, మేజర్ అనే విషయంపై స్పష్టత వస్తుందని డీఎస్పీ తెలిపారు. చాలా మంది స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే మృతురాలిని ఎవరూ గుర్తించలేదు. అత్యాచారం చేసిన తర్వాత గన్‌తో తలపై కాల్చి చంపిన తర్వాత ఆమెకు నిప్పంటించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని..ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని షాద్‌నగర్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారఘటనను పోలి ఉండటం గమనార్హం.